69% మంది పాస్ – జూన్ 7న తదుపరి పరీక్ష
హైదరాబాద్ , లీగల్ రిపోర్టర్: దేశవ్యాప్తంగా యువ న్యాయవాదులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ‘ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్’ (AIBE-XX) ఫలితాలు విడుదలయ్యాయి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) బుధవారం సాయంత్రం అధికారికంగా ఫలితాలను వెల్లడించింది. గతేడాది నవంబర్ 30న జరిగిన ఈ పరీక్షలో మొత్తం 69.21 శాతం మంది అభ్యర్థులు న్యాయవాద వృత్తిని చేపట్టేందుకు అర్హత సాధించారు.
కీలక గణాంకాలు:
మొత్తం హాజరైన వారు: 2,51,968 మంది
అర్హత సాధించిన వారు: 1,74,386 మంది (69.21%)
పురుషులు: 1,13,063 మంది
మహిళలు: 61,310 మంది
ట్రాన్స్జెండర్లు: 13 మంది
95 మార్కులకే ఫలితాలు – 5 ప్రశ్నల తొలగింపు: ఈసారి ఫలితాల గణనలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రశ్నాపత్రంపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన నిపుణుల కమిటీ, మొత్తం 100 ప్రశ్నలలో 5 ప్రశ్నలను తప్పుగా గుర్తించి తొలగించింది. దీంతో ఫలితాలను 100 మార్కులకు కాకుండా 95 మార్కులకు లెక్కించారు. అలాగే మరో రెండు ప్రశ్నలకు రెండు ఆప్షన్లను సరైనవిగా పరిగణించి, ఆ రెండింటిలో ఏది ఎంచుకున్నా మార్కులు కేటాయించారు.
పాస్ మార్కులు (Cut-off) ఇలా:
జనరల్ / ఓబీసీ అభ్యర్థులు: 95 మార్కులకు గాను కనీసం 43 మార్కులు (45%) సాధించిన వారిని అర్హులుగా ప్రకటించారు.
ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు: 95 మార్కులకు గాను కనీసం 38 మార్కులు (40%) సాధించిన వారిని అర్హులుగా ప్రకటించారు.
జూన్ 7న తదుపరి పరీక్ష (AIBE-21): ఫలితాలతో పాటు తదుపరి పరీక్ష షెడ్యూల్ను కూడా బార్ కౌన్సిల్ ప్రకటించింది.
AIBE-21 పరీక్ష తేదీ: జూన్ 7, 2026
రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 11, 2026 నుండి
అభ్యర్థులు తమ ఫలితాలను allindiabarexamination.com వెబ్సైట్లో చూసుకోవచ్చు.
